telugu navyamedia
తెలంగాణ వార్తలు

తెలంగాణలో బీజేపీ పుంజుకుంది నిజం..నేను కన్ఫ్యూజ్‌ కాలేదు.. క్లారిటీతో చెప్పా- రాజగోపాల్‌ రెడ్డి

కాంగ్రెస్‌లో అసలైన ఉద్యమకారులు లేరని  కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో మాట్లాడిన రాజగోపాల్ రెడ్డి.. సొంతపార్టీపై చురకలంటించారు.

తనది నిజమైన కాంగ్రెస్ రక్తమని ప్రకటించారు. నిజమైన కాంగ్రెస్ నేతలకు పార్టీలో గౌరవం లేదని రాజగోపాల్‌రెడ్డి ఆరోపించారు. ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వారికి పదవులు ఇస్తున్నారని విమర్శించారు.

చప్పట్లు వచ్చినంత ఈజీగా ఓట్లు రాలవని అన్నారు. సినిమా డైలాగులకు ఓట్లు రావని స్పష్టం చేశారు. భట్టి తనతో ప్రత్యేకంగా మాట్లేందుకు వచ్చారని ఆయనతో ఎన్నో ఏళ్లుగా కలిసి పనిచేస్తున్నట్లు పేర్కొన్నారు.

భట్టి తాను అన్నదమ్ముల్లాగా ఉన్నామని, కాంగ్రెస్‌కు తానెక్కడ దూరం అవుతానేమోనన్న ఆవేదనతో భట్టి వచ్చారని తెలిపారు. 12 మంది ఎమ్మెల్యేలు పోయినా కాంగ్రెస్‌ పట్టించుకోవడం లేదని చెప్పాను. రాష్ట్రంలో బీజేపీ పుంజుకుంటుంద‌ని చెప్పాన‌ని అన్నారు.

టీఆర్ఎస్‌ని ఎదుర్కొనే శక్తి బీజేపీకి మాత్రమే ఉందన్నారు. పార్టీ మారొద్దని భట్టి విక్రమార్క సూచించారని, పార్టీలో తనకు ఇంతలా ఇబ్బంది ఉన్నా.. ఎందుకు మాట్లాడట్లేదని భట్టిని ప్రశ్నించానని తెలిపారు

టీఆర్ ఎస్‌ నుంచి బయటకు వచ్చిన ఈటల రాజేందర్ కాంగ్రెస్​లో ఎందుకు చేరలేదో ప్రజలు గమనించాలన్నారు.ఈటలకు బీజేపీ తోడైంది..అందుకే గెలిచారు. నేను కన్ఫ్యూజ్‌ కాలేదు.. క్లారిటీతో చెప్పా.

బీజేపీ, టీఆర్‌ఎస్‌ను ఓడిస్తుందని నమ్ముతున్నా..మునుగోడుకు మంత్రి జగదీశ్వర్‌రెడ్డి వందసార్లు వెళ్లినా ఒక్కటే.. నేను ఒక్కసారి వెళ్లినా ఒక్కటే.. కళ్యాణ లక్ష్మీ చెక్కులు ఇచ్చేందుకు మంత్రి వెళ్లాల్సిన అవసరముందా’ అని ప్రశ్నించారు.

Related posts