ఆర్టీసీ కార్మికులపై తెలంగాణ సీఎం కేసీఆర్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి విమర్శించారు. తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మూడు రోజులుగా సీపీఐ నేత కూనంనేని సాంబశివరావు చేస్తున్న దీక్షను పోలీసులు భగ్నం చేసి, నిమ్స్ ఆసుపత్రికి తరలించిన విషయం తెలిసిందే. అక్కడ కూడా దీక్షను కొనసాగిస్తున్న నేపథ్యంలో ఆయనను పరామర్శించారు.
ఈ సందర్భంగా చాడ వెంకట్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ… 48 వేల ఆర్టీసీ కార్మికులు రోడ్డున పడ్డారని అన్నారు. ఈ రోజు కలెక్టరేట్ల వద్ద వినతిపత్రాలు సమర్పిస్తున్నామని తెలిపారు. శాంతియుతంగా దీక్ష చేస్తోన్న కూనంనేనిని అక్రమంగా అరెస్టు చేశారని అన్నారు. కూనంనేని దీక్షకు సంఘీభావంగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో సీపీఐ, అనుబంధ సంఘాలు దీక్షలు చేపట్టాయి.