జమ్మూ కశ్మీర్ లో పౌరులే లక్ష్యంగా ఉగ్రవాదులు ఘాతుకానికి పాల్పడ్డారు. బారాముల్లా జిల్లాలోని సోపోర్ బస్టాండ్లో సోమవారం సాయంత్రం గ్రనేడ్ ను విసరగా ఆరుగురు పౌరులు గాయపడ్డారని పోలీసులు తెలిపారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నట్లు చెప్పారు. భద్రతా బలగాలు ఉగ్రవాదులకోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశాయి.
యూరోపియన్ యూనియన్ (ఈయూ) బృందం రాష్ట్రంలో పరిస్థితిని అంచనా వేయడానికి రేపు రానున్న నేపథ్యంలో ఈ ఘటన జరగడం భద్రతా బలగాలకు సవాల్ గా పరిణమించింది. అటు, ఆదివారం శ్రీనగర్ లో సీఆర్ పీఎఫ్ జవాన్లపై ఉగ్రవాదులు జరిపిన గ్రనేడ్ దాడిలో ఆరుగురు సీఆర్పీఎఫ్ జవాన్లు గాయపడిన విషయం విదితమే.