తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె ప్రజలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. తాత్కాలిక డ్రైవర్లతో ప్రభుత్వం బస్సులను నడిపిస్తున్నా.. అనుభవరాహిత్యం వల్ల పలు చోట్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. బస్సు ఎక్కితే ఎక్కడ ప్రమాదం జరుగుతుందోనని ప్రయాణికులు భయపడుతున్నారు. సోమవారం ఉదయం హైదరాబాద్లోకి కూకట్పల్లిలో రెండు బస్సులు ఢీకొన్న సంగతి తెలిసిందే. అదృష్టవశాత్తు ఈ ప్రమాదం నుంచి ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. తాజాగా నల్లగొండ జిల్లాలో ఓ అద్దె బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం ఓ ప్రమాదానికి కారణమయింది.
నల్లగొండ జిల్లా హాలియా బస్టాండ్లో ప్రయాణికుడి కాలుపైకి బస్సును ఎక్కించాడు ఓ డ్రైవర్. అనుముల మండలానికి చెందిన చంద్రకాంత్.. అద్దె బస్సు ఎక్కి హాలియా బస్టాండ్కు చేరుకున్నాడు. బస్సు దిగుతుండగానే డ్రైవర్ ముందుకు పోనించాడు. దీంతో బస్సు వెనుక చక్రాలు అతని కాలుపై నుంచి వెళ్లాయి. ఈ ప్రమాదంలో అతని కాలికి తీవ్ర గాయాలయ్యాయి.