నమో (నరేంద్ర మోదీ) యుగం అంతమవబోతోందని బీఎస్పీ అధినేత్రి మాయావతి అన్నారు. ఓ బహిరంగ సభలో ఆమె మాట్లాడుతూ జై భీమ్’ అనే సమయం రాబోతోందన్నారు. ఈ సార్వత్రిక ఎన్నికల తర్వాత ఉత్తరప్రదేశ్ లోని అంబేద్కర్ నగర్ లోక్ సభ స్థానం నుంచి పోటీ చేస్తానని ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. తద్వారా మూడోకూటమి అధికారంలోకి వస్తే ప్రధాని రేసులో తాను కూడా ఉంటాననే స్పష్టమైన సంకేతాలను ఇచ్చారు.
జాతీయ రాజకీయాల వైపు వెళ్లే మార్గం అంబేద్కర్ నగర్ గుండా వెళ్తుందని మాయావతి అభిప్రాయం వ్యక్తం చేశారు. మాయావతి ప్రధాని కావాలనే ఆకాంక్షను సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ కూడా పరోక్షంగా వెలిబుచ్చిన సంగతి తెలిసిందే. ఇటీవల ఆయన మాట్లాడుతూ తన సొంత రాష్ట్రానికి చెందిన వ్యక్తి ప్రధాని అయితే తనకు మరింత సంతోషంగా ఉంటుందని చెప్పారు.