ప్రధాని మోదీపై బీఎస్పీ అధినేత్రి మాయావతి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మోదీ, యోగిల డబుల్ ఇంజిన్ గవర్నమెంట్ వల్ల మత ఘర్షణలు పెరిగిపోయాయని ఆరోపించారు. ద్వేషపూరిత వాతావరణం, హింస విపరీతంగా పెరిగిందని దుయ్యబట్టారు. ఈ ఎన్నికల్లో ప్రధాని మోదీ గెలవడం కంటే ఆయన ఓటమే పెద్ద చరిత్రగా మిగిలిపోతుందని ఆమె అన్నారు. మోదీ చెప్పుకునే గుజరాత్ మోడల్ సక్సెస్ కాలేదని ఎద్దేవా చేశారు.
ఉత్తరప్రదేశ్ లోని పూర్వాంచల్ ప్రాంతంలో పేదరికాన్ని అరికట్టడం, ఉద్యోగాల కల్పనలో మోదీ విఫలమయ్యారని విమర్శించారు. మోదీ, యోగి ఇద్దరూ పూర్వాంచల్ నుంచే ప్రతినిథ్యం వహిస్తున్నారని తెలిపారు. యోగి నియోజకవర్గమైన గోరఖ్ పూర్ లో బీజేపీ ఓడిపోయినప్పుడు, వారణాసిలో మోదీ ఓడిపోలేరా? అని ప్రశ్నించారు. 1977లో రాయబరేలిలో జరిగింది ఇప్పుడు వారణాసిలో రిపీట్ కావచ్చని చెప్పారు.