2018లో విడుదలైన `అజ్ఞాతవాసి` తర్వాత పవన్కల్యాణ్ మళ్లీ సినిమాల్లో నటించలేదు. ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొన్నారు. ఇప్పుడు మళ్లీ పవన్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వనున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్లో విజయవంతమైన `పింక్` చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయనున్నారు. దిల్రాజు, బోనీకపూర్ నిర్మాతలుగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందనుంది. సినిమా సెట్స్ పైకి వెళ్లే లోపు పక్కా ప్రణాళికతో ప్రీ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసుకోవాలని దర్శక నిర్మాతలు భావిస్తున్నారు. అందులో భాగంగా ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయట. పింక్ రీమేక్ విషయంపై నిర్మాత బోనీకపూర్ జాతీయ మీడియాతో చిట్ చాట్ చేశారు. “ఓ మంచి సినిమా వీలైనంత ఎక్కువ మందికి చేరాలి. నిర్మాతగా హిందీలో నా మొదటి సినిమా హమ్ పాంచ్. కన్నడలో వచ్చిన ‘పడవారల్లి పాండవురు’ చిత్రానికి ఇది రీమేక్. పింక్ తమిళ రీమేక్ నేర్కొండ పార్వై కూడా ఘనవిజయం సాధించింది. దీంతో మంచి సినిమాకు ఎపుడూ విజయం దక్కుతుందన్న నమ్మకమేర్పడింది. కథ బాగుండటం వల్లే పింక్ ను రీమేక్ చేయాలనే ఆలోచన. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ నటించిన సినిమా ‘పింక్’. ఇది చాలా మంది విజయం అందుకుంది. తమిళ నటుడు అజిత్తో కలిసి ఏదన్నా సినిమా చేయాలన్నది నా భార్య శ్రీదేవి కల. ఆ కల నెరవేర్చడం కోసం నేను పింక్ను తమిళంలో ‘నేర్కొండ పార్వాయ్’ టైటిల్తో రీమేక్ చేశాను. ఈ వెర్షన్ కూడా బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది. ఆ తర్వాత తెలుగులో తీసినా అంతే విజయం సాధిస్తుందన్న నమ్మకం ఏర్పడింది. అందుకే ఈ సినిమాను తెలుగులో తీయాలని నిర్ణయించుకున్నాను. తెలుగు ప్రేక్షకులను నచ్చే అంశాలతోనే సినిమాను తీస్తాం. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ ఈ సినిమా చేస్తే బాగుంటుంది అనిపించింది. అందుకే ఆయన్ను ఒప్పించాను” అని వెల్లడించారు.
previous post