మహారాష్ట్ర, హర్యానాలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇవాళ ఉదయం నుంచి పోలింగ్ కొనసాగుతోంది. మహారాష్ట్ర ఎన్నికల్లో పలువురు సినీ, క్రీడా రంగానికి చెందిన ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. మహారాష్ట్రలో మొత్తం 288 స్థానాల్లో అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఈ నెల 24న ఫలితాలు వెలువడనున్న విషయం తెలిసిందే. మరోవైపు హర్యానాలో ఇవాళే 90 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. పశ్చిమ బాంద్రాలోని పోలింగ్ బూత్లో బాలీవుడ్ స్టార్ ఆమీర్ ఖాన్ ఓటు వేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఆయన సతీమణి కిరణ్ రావు కూడా తన ఓటుహక్కును వినియోగించుకున్నారు. టెన్నిస్ స్టార్ మహేశ్ భూపతి సతీసమేతంగా ఓటేశారు. భార్య లారాదత్తాతో కలిసి ఓటేయడానికి వచ్చారు. సినీనటుడు, గోరఖ్పూర్ ఎంపీ రవికిషన్ గోరేగావ్లో ఓటు హక్కు వినియోగించుకోగా… మరోనటి పద్మిని కొల్హాపురె తన ఓటును పశ్చిమ అంధేరీలో వేశారు.పశ్చిమ బాంద్రాలోనే బాలీవుడ్ బ్యూటీ మాధురీ దీక్షిత్ కూడా ఓటేశారు. లాతూర్ పోలింగ్ బూత్లో నటుడు రితేశ్ దేశ్ముఖ్, ఆయన సతీమణి జెనీలియా డిసౌజా ఓటు వేశారు. రితేశ్ సోదరులు అమిత్, ధీరజ్ లాతూర్ సిటీ, లాతూర్ రూరల్ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. నటి దియామీర్జా ముంబైలో ఓటేశారు.