బీజేపీపై దేశవ్యాప్తంగా తీవ్రమైన వ్యతిరేకత ఉన్నాకూడా పట్టు విడవకుండా రాబోయే ఎన్నికలలో విజయం కోసం ప్రయత్నిస్తూనే ఉంది. ఎక్కడెక్కడ అవకాశాలు ఉన్నాయో అవన్నీ ఉపయోగించుకుంటుంది. తాజాగా, అధికార అన్నాడీఎంకేతో పొత్తును ఖరారు చేసుకునే ప్రయత్నాల్లో ఉన్న బీజేపీ వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తమకు గెలుపు అవకాశాలున్న పది నియోజకవర్గాలపై దృష్టి సారించింది. దక్షిణ చెన్నై నియోజకవర్గం సహా పది నియోజకవర్గాలను ఎలాగైనా దక్కించుకోవాలని పావులు కదుపుతోంది. ఈ నేపథ్యంలో నటుడు విజయకాంత్ నాయకత్వంలోని డీఎండీకే కూడా అన్నాడీఎంకే కూటమిలో చేరేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది.
అధికార అన్నాడీఎంకే పార్టీ ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు దరఖాస్తులను పంపిణీ చేసే కార్యక్రమాల్లో తలమునకలైంది. ఈ పరిస్థితుల్లో జాతీయ పార్టీ బీజేపీ 2014 పార్లమెంట్ ఎన్నికలలో సుమారు రెండు లక్షల ఓట్లు సంపాదించుకున్న దక్షిణ చెన్నై, వేలూరు, కోయంబత్తూరు, తిరుప్పూరు, పొల్లాచ్చి, పెరంబలూరు, శివకాశి, విరుదునగర్, చిదంబరం, రామనాథపురం, కృష్ణగిరి, అరక్కోణం, కన్నియాకుమారి నియోజకవర్గాలను తమకు కేటాయించమంటూ అన్నాడీఎంకే నేతలతో చర్చలు సాగిస్తోంది.