భారత షట్లర్ సాయి ప్రణీత్ డెన్మార్క్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్-750 బ్యాడ్మింటన్ టోర్నీలో అద్భుత ప్రదర్శన చేశాడు. ఇవాళ జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో చైనా దిగ్గజం లిన్ డాన్ను ప్రణీత్ మట్టికరిపించాడు. ఐదుసార్లు వరల్డ్ ఛాంపియన్ లిన్డాన్పై గెలవడం ప్రణీత్ కెరీర్లో ఇదే తొలిసారి కావడం విశేషం. కఠిన ప్రత్యర్థి లిన్డాన్పై అన్ని రంగాల్లో ఆధిపత్యం ప్రదర్శంచిన ప్రణీత్ 21-14, 21-17తో మ్యాచ్ను కైవసం చేసుకున్నాడు.
మ్యాచ్ ఆరంభం నుంచి దూకుడైన ఆటతో ఎలాంటి తడబాటు లేకుండా ఆధిక్యాన్ని కాపాడుకుంటూ వచ్చాడు. వరుసగా పాయింట్లు సాధిస్తూ ప్రత్యర్థి లిన్డాన్పై ఒత్తిడి పెంచడంతో పుంజుకోలేకపోయాడు. కేవలం 35 నిమిషాల్లోనే మ్యాచ్ను ముగించిన ప్రణీత్ రెండో రౌండ్కు దూసుకెళ్లాడు. వరల్డ్ ఛాంపియన్ భారత ఏస్ షట్లర్ పీవీ సింధు కూడా రెండో రౌండ్లో అడుగుపెట్టింది. మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో సింధు 22-20 21-18తో గ్రెగోరియా మరిస్కా(ఇండోనేషియా)పై నెగ్గింది.