తన భర్తపై తప్పుడు కేసులు పెడుతున్నారని మాజీ మంత్రి భూమా అఖిలప్రియ ఆరోపించారు. ఓ మీడియా చానల్ ప్రతినిధితో మాట్లాడుతూ తాము ఫ్యాక్షన్ కేసులకే భయపడలేదని, ఇలాంటి కేసులకు భయపడతామా? అంటూ వ్యాఖ్యానించారు. పరారీలో ఉండాల్సిన అవసరం ఆయనకు లేదని స్పష్టం చేశారు. తమ కుటుంబం పరువు తీయడానికే తప్పుడు కేసులు పెట్టినట్టు అర్థమవుతోందని ఆరోపించారు.
గతంలో భూమా నాగిరెడ్డి గారిపైనా ఇలాగే కేసులు పెట్టి దుష్ప్రచారం చేశారు. ఇప్పుడు నా భర్తను లక్ష్యంగా చేసుకున్నారు. ఎలాంటి తప్పు చేయకపోయినా అన్యాయంగా కేసులు పెట్టారని దుయ్యబట్టారు. మేం ఫ్యాక్షన్ కుటుంబం నుంచి వచ్చాం. ఇంతకంటే దారుణమైన పరిస్థితులు చూశాం. ఒక చిన్న సివిల్ కేసును అటెంప్ట్ మర్డర్ కేసుగా మార్చేందుకు పోలీసులు ఎందుకింతగా ఇన్వాల్వ్ అవుతున్నారో మాకు అర్థం కావడంలేదు.
మఫ్టీలో ఉన్న పోలీసు అధికారి ప్రైవేటు వాహనంలో హైదరాబాద్ వస్తే మా ఆయనకు వాళ్లు పోలీసులని ఎలా తెలుస్తుంది? ఏ విధంగా వాళ్లను వెహికిల్ తో గుద్దించే ప్రయత్నం చేస్తాడు? ప్రైవేటు వాహనంలో పోలీసులు ఆంధ్రా నుంచి రావాల్సిన అవసరం ఏముంది? ఏదో పగబట్టి మా ఇమేజ్ ను డ్యామేజ్ చేయడానికి చేసే ప్రయత్నాలే తప్ప ఇందులో వాస్తవాలే లేవని ఆమె స్పష్టం చేశారు.