పుల్వామా దాడి దేశప్రజలపై తీవ్రంగా ప్రభావం చూపించింది అనడానికి ఒక ఉదాహరణగా ఈ సందర్భాన్ని చెప్పవచ్చు. పాక్ పేరుపై ఉన్న కరాచీ అనే విషయాన్నీ కూడా ప్రజలు జీర్ణించుకోలేకపోయారు. దీనితో నిరసనలు చేశారు. ఇది చాలా చిన్న విషయం అయినప్పటికీ, ప్రజలపై ఉగ్రదాడి ప్రభావాన్ని సుస్పష్టంగా తెలియజెప్పింది. దీనితో దిగివచ్చిన యాజమాన్యం, ఆ కరాచీ బేకరీ పేరును ఇండియన్ కరాచీ గా మారుస్తామన్నారు. పాకిస్థాన్ నగరం పేరుతో ఈ బేకరీ ఉండటంతో పలుచోట్ల ఈ బేకరీల ముందు ఆందోళనకారులు నిరసన తెలిపారు. కరాచీ అనే పేరును మార్చుకోవాల్సిందేనని డిమాండ్ చేశారు.
ఈ నేపథ్యంలో కరాచీ బేకరీ యాజమాన్యం ఒక ప్రకటన చేసింది. తమ పేరును ఇకపై ‘ఇండియన్ కరాచీ బేకరీ’ గా మార్చుతున్నట్టు ప్రకటించింది. హైదరాబాద్ మొజాంజాహీ మార్కెట్ వద్ద ఉన్న కరాచీ బేకరీ యాజమాన్యాన్ని కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ కలిసి, వారితో చర్చలు జరిపారు. ఈ నేపథ్యంలో పేరును మార్చుతామని బేకరీ యాజమాన్యం హామీ ఇచ్చింది. రెండు, మూడు రోజుల్లో ఇండియన్ కరాచీ బేకరీ అనే పేర్లు పెడతామని చెప్పింది. ఈ మేరకు బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు శ్రీనివాస్ యాదవ్ ఓ ప్రకటనలో తెలిపారు.