telugu navyamedia
సినిమా వార్తలు

ప్రకాశ్‌రాజ్‌ ‘మా’ని మరింత అభివృద్ధి చేయగలడు: బండ్ల గణేశ్‌

‘మా’ అధ్యక్ష ఎన్నికలు రోజురోజుకీ ఉత్కంఠ భరితంగా మారుతున్నాయి. ఎన్నడూ లేనట్టుగా ఈ సారి ఐదుగురు సభ్యులు అధ్యక్ష పదవి కోసం రంగంలోకి దిగారు. ప్రకాష్ రాజ్, మంచు విష్ణు, హేమ, నటుడు సీవీఎల్ నరసింహారావు, జీవిత ఇలా అందరూ అధ్యక్ష పోటీలో ఉన్నారు. ‘మా’ భవన నిర్మాణమే అజెండాగా నిలబడ్డారు. సినిమా బిడ్డల ప్యానల్‌ పేరుతో ఎన్నికల బరిలోకి దిగిన ప్రకాశ్‌రాజ్‌ టీమ్‌కి నిర్మాత బండ్ల గణేశ్‌ మద్దతు తెలిపిన విషయం విదితమే. కాగా, తాజాగా ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘మా’ ఎన్నికలు, శాశ్వత భవన నిర్మాణం గురించి బండ్ల గణేశ్‌ కొన్ని షాకింగ్ కామెంట్స్‌ చేశారు. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ‘మా’కు శాశ్వత భవనం నిర్మించాల్సిన అవసరం లేదన్నారు.

‘ప్రకాశ్‌రాజ్‌ ప్రజల కోసం ఎన్నో సేవలు చేశారు. ఆయన చేసిన ఎన్నో సేవా కార్యక్రమాలను నేను కళ్లారా చూశాను. ‘మా’లో కూడా ఆయన ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయాలనుకుంటున్నాడు. ‘మా’ని మరింత అభివృద్ధి చేయగలడని నాకు నమ్మకం ఉంది. అందుకే ఆయనకు నా మద్దతు ప్రకటించాను. ఎన్నికల్లో పోటీ చేస్తున్న ప్రతిఒక్కరూ ‘మా’కు శాశ్వత భవనం నిర్మించడమే ప్రధాన అజెండాగా బరిలోకి దిగుతున్నారు.

నిజం చెప్పాలంటే నేను ‘మా’ బిల్డింగ్‌కు వ్యతిరేకిని. ఇప్పుడు అది కట్టాల్సిన అవసరం లేదు. అసోసియేషన్‌లో సుమారు 900 మంది సభ్యులున్నారు. వారిలో దాదాపు 150 మంది వరకూ దారిద్యరేఖకు దిగువన ఉన్నారు. ఎన్నో కష్టాలు పడుతున్నారు. సరైన ఆర్థిక స్థోమతలేక ప్రతి నెలా ఎన్నో ఇబ్బందులు చవి చూస్తున్నారు. నా ఉద్దేశం ప్రకారం.. బిల్డింగ్‌ నిర్మాణం కోసం ఖర్చు చేసే రూ.20 కోట్లతో పేద కళాకారులందరికీ డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు నిర్మించి, ఉచితంగా ఇస్తే ఆ కిక్కే వేరే లెవల్‌లో ఉంటుంది. మా’కి బిల్డింగ్‌ లేకపోతే ఇండస్ట్రీ ఆగిపోదు. సినిమా షూటింగ్స్‌ నిలిచిపోవు. సినిమాలు చూసే వాళ్లు తగ్గిపోరు’ అని బండ్ల గణేశ్‌ కామెంట్‌ చేశారు.

Related posts