ఒక్క ఓవైసీని చంపితే లక్షలాది మంది ఓవైసీలు పుడతారని అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. చాప్రౌలీ నియోజకవర్గం నుంచి పోటీ పడుతున్న ఎంఐఎం అభ్యర్థి అనీస్ అహ్మద్కు మద్దతుగా అసరా గ్రామంలో జరిగిన బహిరంగ సభలో ఓవైసీ వ్యాఖ్యానించారు.
మహాత్మాగాంధీని హత్య చేసిన వారే ఇప్పుడు తనపైనా దాడి చేశారని అన్నారు. తాను వాస్తవాలు మాట్లాడుతుండడం, బీజేపీ కళ్లలోకి సూటిగా చూసే ధైర్యం చేస్తుండడంతోనే తనపై కాల్పులు జరిపారని ఆయన మండిపడ్డారు. తనపై కాల్పులు జరిపిన వారే గాంధీ హత్య వెనక కూడా ఉన్నారని ఆరోపించారు. ఒక్క ఒవైసీని చంపితే లక్షల మంది ఒవైసీలు పుట్టుకొస్తారని హెచ్చరించారు.
ఒవైసీపై కాల్పులు జరిపిన కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరికి బీజేపీతో సంబంధాలు ఉన్నాయన్న వార్తల నేపథ్యంలో ఒవైసీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలు ముగిశాక అఖిలేశ్ తన హామీలను తుంగలో తొక్కుతారని విమర్శించారు. ‘‘అఖిలేశ్ మిమ్మల్ని మళ్లీ మోసం చేస్తారు జాగ్రత్త’ అని ప్రజలను హెచ్చరించారు. మైనారిటీలకు అఖిలేశ్ యాదవ్ ‘లాలీపాప్’ ఇస్తారని అన్నారు. రాజ్యసభ సభ్యులను చేస్తానని, ఎమ్మెల్సీలు చేస్తానని అంటారని, ఆ తర్వాత వారిని పట్టించుకోరని ఒవైసీ ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాగా..అసదుద్దీన్ ఓవైసీపై గురువారం ఉత్తరప్రదేశ్లో హత్యాయత్నం జరిగింది. పశ్చిమ యూపీలో అసెంబ్లీ ఎన్నికలు ప్రచారంలో పాల్గొని, గురువారం దిల్లీకి తిరిగివస్తుండగా హపూర్-ఘజియాబాద్ మార్గంలో ఛిజార్సీ టోల్ప్లాజా సమీపంలో ఓవైసీ కారుపై దుండగులు కాల్పులు జరిపారు.