వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ రఘురామకృష్ణంరాజుకు ఆపార్టీ అధిష్టానం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. వారం రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని నోటీసుల్లో స్పష్టం చేసింది. పార్టీ హైకమాండ్ కు వ్యతిరేకంగా ఆయన వ్యాఖ్యలు చేశారని వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి నోటీసుల్లో పేర్కొన్నారు. ఆంగ్ల మాధ్యమం విషయంలో పార్టీ మేనిఫెస్టోకు భిన్నంగా ఆయన పలు వ్యాఖ్యలు చేశారని తెలిపారు.
వైసీపీ ఎమ్మెల్యేలు రాష్ట్రంలో ఇసుక దోపిడీకి పాల్పడుతున్నారంటూ ఆయన ఎటువంటి ఆధారాలు లేకుండా ఆరోపణలు గుప్పించారని తెలిపారు. రఘురామకృష్ణం రాజు సొంత పార్టీని కించపర్చేలా వ్యాఖ్యలు చేయడమే కాకుండా సీఎం జగన్పై కూడా పలు వ్యాఖ్యలు చేశారని చెప్పారు. అంతేకాకుండా అనేక సందర్భాలలో ఆయన మీడియా ముందు పార్టీ, ఏపీ ప్రభుత్వ నిర్ణయాలపై విమర్శలు చేశారని తెలిపారు.