క్రూజ్ నౌక డ్రగ్స్ కేసు వ్యవహారంలో బాలీవుడ్ అగ్ర హీరో షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ కు కోర్టు షాకిచ్చింది. ఆర్యన్ తో సహా ఎనిమిది మంది నిందితులకు ముంబయి సిటీ కోర్టు ఈ నెల 11వరకు జ్యుడిషియిల్ కస్టడీ విధించింది.
ఈ నెల 11వరకు తమ కస్టడీకి ఇవ్వాలన్న కస్టడీకి ఇవ్వాలన్న ఎన్సీబీ అభ్యర్థతను తోసిపుచ్చిన న్యాయస్థానం.. నిందితులకు 14 రోజుల పాటు జ్యుడిషియల్ కస్టడీ విధించింది. ఇప్పటికే తగినంత సమయం ఇచ్చినందున నిర్బంధ విచారణ అవసరం లేదని అభిప్రాయపడినట్టు న్యాయమూర్తి తెలిపారు. జ్యుడిషియల్ కస్టడీ విధించిన నిమిషాల వ్యవధిలోనే ఆర్యన్ తరఫు న్యాయవాది మానేశ్ శిందే మధ్యంతర బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే, దీనిపై రేపు ఉదయం 11గంటలకు విచారణ జరపనున్నట్టు న్యాయమూర్తి తెలిపారు. విచారణ సమయంలో షారుక్ ఖాన్, అతడి సతీమణి గౌరీఖాన్ కోర్టులో లేరు.
అక్టోబర్ 3న గోవాకు చెందిన క్రూజ్ నౌకలో రేవ్ పార్టీ జరుగుతుందని సమాచారం అందుకున్న ఎన్సీబీ అధికారులు.. జరిపిన దాడుల్లో ఆర్యన్ ఖాన్, మూన్మూన్ ధామేచ, అర్బాజ్ మెర్చంట్ సహా ఎనిమిది మంది ప్రముఖుల పిల్లలను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
వీరిని ఇటీవల కోర్టులో హాజరు పరచగా.. తదుపరి దర్యాప్తు నిమిత్తం ఎన్సీబీకి అప్పగించింది. ఆ కస్టడీ నేటితో ముగియడంతో మరోసారి నిందితులను అధికారులు కోర్టులో హాజరుపరచగా.. ఆర్యన్ సహా ఎనిమిది మందికి న్యాయస్థానం జ్యుడీషియల్ కస్టడీ విధించింది. ఆర్యన్ సహా ఈ కేసులో నిందితులను ఈ రాత్రికి ముంబయిలోని ఎన్సీబీ కార్యాలయంలోనే ఉంచనున్నారు. ఎన్సీబీ కార్యాలయంలో ఆర్యన్ను కలిసేందుకు కుటుంబ సభ్యులకు అవకాశం కల్పించినట్టు సమాచారం.