telugu navyamedia
ట్రెండింగ్ విద్యా వార్తలు

నాంపల్లి తెలుగు విశ్వవిద్యాలయం .. పలు కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం…

applications invited from telugu univeristy

నాంపల్లిలోని తెలుగు విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ఆచార్య అలేఖ్య పుంజాల పలు రకాల కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. కళలు, సంస్కృతి, సంగీతం, నాటకం, చిత్ర శిల్పకళ, జానపద కళలు, విజ్ఞానం, భాషా శాస్త్రం, వ్యాకరణం, సాహిత్యం, చరిత్ర, పురావస్తు శాస్త్ర, జ్యోతిషం వంటి కోర్సుల్లో చేరొచ్చని పేర్కొన్నారు. హైదరాబాద్ ప్రాంగణంలో శిల్పం, చిత్రలేఖనం, ప్రింట్ మేకింగ్‌లో బ్యాచిలర్ కోర్సుతో పాటుగా ఎంఏ(తెలుగు), ఎంఏ(అనువర్తిత భాషా శాస్త్రం), ఎంఏ (కర్ణాటక సంగీతం), ఎంపీఏ (కూచిపూడి/ ఆంధ్రనాట్యం), ఎంపీఏ(జానపద కళలు), ఎంపీఏ (రంగస్థల కళలు), ఎంఏ(జర్నలిజం), సాయంకాలం కోర్సుగా ఎంఏ(జ్యోతిషం) వంటి పోస్టు గ్రాడ్యుయేషన్ కోర్సులు, వివిధ లలిత కళా రంగాల్లో పీజీ డిప్లొమా, డిప్లొమా, సర్టిఫికెట్, కళా ప్రవేశిక, ప్రాథమిక ప్రవీణ కోర్సులున్నట్లు వివరించారు.

ఎంఏ(తెలుగు) ను రాజమండ్రి నన్నయ ప్రాంగణంలో, శ్రీశైలం పాల్కురికి సోమనాథ ప్రాంగణంలో ఎంఏ(చరిత్ర పురావస్తు శాస్త్రం), కూచిపూడిలోని శ్రీసిద్దేంద్రయోగి కూచిపూడి కళాపీఠంలో ఎంపీఏ(కూచిపూడి నృత్యం) కోర్సులు అందుబాటులో ఉన్నాయి. వరంగల్ జానపద గిరిజన విజ్ఞాన పీఠం, రాణి రుద్రమదేవి పేరిణి కేంద్రం ద్వారా రెండేండ్ల కాల వ్యవధితో పేరిణి నృత్య విశారద కోర్సును అందజేస్తున్నట్లు వివరించారు. హైదరాబాద్, రాజమండ్రి, శ్రీశైలం, వరంగల్ కూచిపూడిలోని పొట్టి శ్రీరాములు తెలుగు వర్సిటీ ప్రాంగణాల్లోని కోర్సులకు ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తారని తెలిపారు. ఆసక్తి ఉన్నవారు ఆన్‌లైన్ ద్వారా రూ.350 చెల్లించి జూన్ 22లోపు దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుందని, ఆలస్య రుసుంతో జూన్ 29లోపు చెల్లించాలని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు వెబ్‌సైట్ www.teluguuniversity.ac.in లో సంప్రదించాలని సూచించారు.

Related posts