ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు మంగళవారం నిరవధికంగా వాయిదా పడ్డాయి. ఈ మేరకు శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రకటించారు. నూతనంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఎన్నికైన తర్వాత తొలిసారి జరిగిన అసెంబ్లీ సమావేశాలు ఐదురోజులపాటు కొనసాగాయి. సభలో ఒక మంత్రి ప్రకటన చేయగా.. ఒక తీర్మానం చేశారు. తొలిరోజు ఎమ్మెల్యేగా ఎన్నికైన సభ్యులతో ప్రొటెం స్పీకర్ ప్రమాణ స్వీకారం చేయించగా, రెండో రోజు స్పీకర్ను ఎన్నుకున్నారు. మూడో రోజు సభలో గవర్నర్ ప్రసంగించారు.
ఐదవ రోజు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై వాడీవేడిగా జరిగింది. మొత్తం 19 గంటల 25 నిమిషాలపాటు అసెంబ్లీ సమావేశాలు నడిచాయి. ఈ సమావేశాల్లో 175మంది సభ్యులు ప్రసంగించారు. అనంతరం ప్రత్యేక హోదాపై శాసనసభ ఏకగ్రీవంగా తీర్మానాన్ని ఆమోదించింది.