రష్యాలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. మాస్కోలోని షెరమిత్యేవో ఎయిర్పోర్టు నుంచి ఆర్కిటిక్ ప్రాంతంలోని ముర్మాన్స్క్ నగరానికి బయల్దేరిన విమానంలో.. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే మంటలు చెలరేగడంతో పైలట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశాడు. విమానం తోకభాగంలో పిడుగు పడటంతో ఆకాశంలోనే మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 41మంది మృతి చెందగా.. పలువురికి గాయాలయ్యాయి. అత్యవసర చికిత్సకై క్షతగాత్రులను స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్యం చేయిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది. మాస్కో కాలమానం ప్రకారం ఆదివారం సాయంత్రం 5.50 గంటలకు ఈ ఘోరం జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన సమయంలో 73 మంది ప్రయాణికులు, ఐదుగురు సిబ్బంది ఉన్నారు. ఇదిలా ఉంటే.. దట్టమైన నల్లని పొగతో, నిప్పులు చిమ్ముకుంటూ నింగి నుంచి దూసుకువచ్చిన విమానం రన్వేపై వెళ్తున్న దృశ్యాలు.. విమానం ఆగాక అందులోని ప్రయాణికులు అత్యవసర ద్వారాల నుంచి కిందికి జారి, ప్రాణాలు అరచేత పెట్టుకుని అక్కణ్నుంచీ పారిపోతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
previous post