telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు

స్మార్ట్ పోలీస్ … అత్యవసరం .. : అమిత్ షా

amith shah bjp

హోం మంత్రి అమిత్ షా హైదరాబాదు లోని సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీలో 70వ బ్యాచ్ ఐపిఎస్ ప్రొబేషనర్స్ పాసింగ్ ఔట్ పరేడ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ వేడుకలో హోం మంత్రి ప్రొబేషనర్స్ కవాతును పరిశీలించి, ఉత్తమ పనితీరు కనబరిచిన ప్రొబెషనర్లకు బహుమతి ప్రదానం చేశారు, మొత్తం 103 మంది అధికారులలో 15 మంది మహిళా అధికారులు, 6 గురు రాయల్ భూటాన్ పోలీసులు మరియు 5 గురు నేపాల్ పోలీస్ సర్వీస్ అధికారులు ఉన్నారు. ప్రొబెషనరీ అధికారులందరినీ, ముఖ్యంగా మహిళా అధికారులను షా అభినందించారు. యువ అధికారులు అత్యంత అంకిత భావంతో దేశానికి సేవ చేయడం ద్వారా భారతీయ పోలీసు సేవ యొక్క విశిష్ట సంప్రదాయంలో భాగస్వాములవుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. లక్ష్య సాధనకు ఐపిఎస్ లో చేరడంతో పూర్తి కాలేదని, భవిష్యత్తులో ఎన్నో సవాళ్లను ఎదుర్కోవాలని చెప్పారు.

తొలి హోం మంత్రి సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ హైదరాబాద్‌ సంస్థానాన్ని భారత్‌ లో విలీనం చేసేందుకు ఎంతో కష్టపడ్డారని గుర్తు చేశారు అమిత్ షా. భారత్‌ లోకి ఎన్నో సంస్థానాలను విలీనం చేసేందుకు పటేల్ కష్టపడ్డారని చెప్పారు. ఎప్పటి నుంచో సమస్యగా మారిన జమ్ము, కశ్మీర్‌ కు నరేంద్ర మోదీ సర్కార్ విముక్తి కల్పించిందని అమిత్ షా గుర్తు చేశారు. ఆర్టికల్ 370 రద్దు చేసి అక్కడి అభివృద్ధికి తమ ప్రభుత్వం బాటలు వేస్తోందని చెప్పారు. హైదరాబాద్ సంస్థానాన్ని భారత్‌ లో విలీనం కోసం సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ ఎంతో కృషి చేశారని తెలిపారు. స్వదేశీ సంస్థానాల విలీనం కోసం పటేల్ చేసిన కృషి ఎప్పటికీ మరచిపోలేనిదన్న అమిత్ షా.. పోలీస్ సేవలు ఎక్కడ ఉంటే అక్కడ సర్ధార్ పటేల్ ఉంటారన్నారు. సర్దార్ పటేల్ సివిల్ సర్వీసుల రూపకల్పనలో కీలక పాత్ర పోషించారనీ, వారు సమాజంలోని పేదవారి అభ్యున్నతికి పాటుపడాలని అభిలషించేవారని షా పేర్కొన్నారు. ఐపిఎస్‌ సాధించడంతోనే ఆశయం నెరవేరినట్లు కాదని, నిజాయితీగా పని చేసి దేశాభివృద్ధికి కృషి చేయాలని కోరారు.

Related posts