నేడు కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షా వందేభారత్ ఎక్స్ప్రెస్ కు పచ్చజెండా ఊపి ప్రారంభించనున్నారు. ఢిల్లీ నుంచి కట్రా స్టేషను వరకు నడిచే వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలును అమిత్ షా గురువారం ఉదయం 9 గంటలకు న్యూఢిల్లీ రైల్వేస్టేషను నుంచి ప్రారంభించనున్నారు. గత నెలలోనే ఢిల్లీ- కట్రా మార్గంలో వందేభారత్ ఎక్స్ప్రెస్ ట్రయల్ రన్ పూర్తి చేశామని రైల్వేబోర్డు ఛైర్మన్ వినోద్ కుమార్ యాదవ్ చెప్పారు.
నవరాత్రి ఉత్సవాల సందర్భంగా యాత్రికులకు వందేభారత్ ఎక్స్ప్రెస్ బహుమతిగా ఇస్తున్నామని రైల్వేబోర్డు ఛైర్మన్ పేర్కొన్నారు. దేశంలో రద్దీగా ఉన్న ఢిల్లీ-ముంబై, ఢిల్లీ-హౌరా రైలుమార్గాల్లోనూ డిసెంబరుకల్లా వందేభారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు నడుపుతామని ఆయన తెలిపారు. మేక్ ఇన్ ఇండియా ప్రాజెక్టులో భాగంగా దేశంలో 2022 కల్లా 40 వందేభారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు నడపాలని లక్ష్యంగా పెట్టుకున్నామని వినోద్ కుమార్ వివరించారు.