2025 నాటికి చంద్రుడిపై స్థావరాన్ని ఏర్పాటు చేసుకునేందుకు తమ ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోందని రష్యా ప్రభుత్వ సీనియర్ అధికారి చెప్పారు. ఈ స్థావరం ద్వారా ఉల్కాపాతం, ఇతర ప్రకృతి విపత్తులను పర్యవేక్షించటంతో పాటు ఇతర గ్రహాలకు రాకెట్లు పంపేందుకు ఏర్పాట్లు చేస్తామని ఆయన వివరించారు.
ఈ ఏడాది చివరి నాటికి రష్యా అంతరిక్ష పరిశోధనా సంస్థ రాస్కాస్మాస్ ఆయా అంశాలపై అధ్యయనం చేసి ఇందుకు సంబంధించిన సమగ్ర ప్రణాళికను రూపొందిస్తుందని రాస్కాస్మాస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అలెగ్జాండర్ బ్లోషెంకో చెప్పారు. ఈ ప్రణాళికను 2025 తరువాత అమలు చేస్తామని ఆయన వివరించారు. ఈ అధ్యయనానికి అవసరమైన ప్రత్యేక టెలిస్కోప్లు, ఇతర పరికరాలను చంద్రగ్రహం దక్షిణ ధృవంలో ఏర్పాటుచేస్తామన్నారు.