ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయిన టిక్టాక్ విషయంలో అమెరికా కూడా జాగ్రత్తలు తీసుకోవడం ప్రారంభించింది. టిక్టాక్ మాతృసంస్థ చైనాకు చెందినది కావడంతో ఈ విషయంలో అమెరికా చాలా అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. టిక్టాక్ అడ్డుపెట్టుకొని తమ సైనికులకు చైనా వల వేసే అవకాశాలున్నాయనేది అమెరికా వాదన. కావున తమ సైనికులెవరూ తమ అధికారిక మొబైల్ ఫోన్లలో టిక్టాక్ ఉపయోగించొద్దని అమెరికా నేవీ ఇప్పటికే ఉత్తర్వులు జారీచేసింది. ఈ క్రమంలో అమెరికా ఆర్మీ కూడా ఇవే చర్యలు తీసుకుంటున్నట్లు తెలిసింది.
ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు అమెరికా ఆర్మీ ప్రతినిధి లెఫ్టినెంట్ కల్నల్ రాబిన్ ఒచోవా వెల్లడించారు. టిక్టాక్ను ఓ సైబర్ థ్రెట్గా ఆమె అభివర్ణించారు. డిసెంబరు నుంచే తాము సైనికులకు హెచ్చరికలు చేస్తూ వస్తున్నామని ఆమె తెలిపారు. టిక్టాక్ ద్వారా చైనా తమ సైనికుల వ్యక్తిగత విషయాలను తెలుసుకొని, దేశద్రోహం చేసే విధంగా వారిని బెదిరింపులకు గురిచేసే అవకాశం ఉందని కొందరు అధికారులు అభిప్రాయపడుతున్నట్లు సమాచారం. అయితే ఆది నుంచీ తమపై వస్తున్న ఆరోపణలను టిక్టాక్ మాతృసంస్థ బైట్డ్యాన్స్ ఖండిస్తూనే వస్తోంది. కావాలంటే టిక్టాక్ యాజమాన్యాన్ని విదేశీ కంపెనీలకు అమ్మడానికి కూడా సిద్ధమని ప్రకటించింది. కానీ అమెరికా మాత్రం ఈ విషయంలో వెనక్కు తగ్గడంలేదు.