ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలని రాజధాని రైతులు, మహిళలు పెద్ద ఎత్తున్న చేపట్టిన మహాపాదయాత్ర నేటితో ముగిసింది. అలిపిరి శ్రీనివాసుడి పాదాల చెంత 108 కొబ్బరికాయలు కొట్టి మహా పాదయాత్ర ముగించారు అమరావతి రైతులు.
ఆ సమయంలో రైతులు జై అమరావతి… జైజై అమరావతి.. అంటూ నినాదాలు చేయడంతో అలిపిరి ప్రాంతమంతా అమరావతి నినాదాలతో హోరెత్తింది.
నవంబర్ 1న తుళ్లూరు నుంచి న్యాయస్థానం- దేవస్థానం పేరుతో చేపట్టిన యాత్ర 45వ రోజైన ఇవాళ అలిపిరిలో ముగిసింది. 44 రోజులుగా రైతులు గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో 450 కి.మీ. పైగా పాదయాత్ర చేశారు.
రేపటి నుంచి మూడు రోజులపాటు కేవలం 500 మందికి మాత్రమే శ్రీవారి దర్శన భాగ్యం లభించింది. ఈ మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం తగిన ఏర్పాట్లను కూడా పూర్తి చేసింది.
న్యాయస్థానం ఆదేశాలకు అనుగుణంగా అమరావతే రాజధానిగా ఉండాలన్న తమ ఆకాంక్ష వ్యక్తమయ్యేలా ఈనెల 17వ తేదీన తిరుపతి వేదికగా భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు రైతులు సిద్ధమవుతున్నారు.
మరోవైపు.. రైతులు చేస్తున్న మహాపాదయాత్రకు సంఘీభావంగా టీడీపీ శ్రేణులు సంఘీభావ ర్యాలీలు నిర్వహించాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పిలుపునిచ్చారు. బుధవారం జోన్ 3, 4, 5 పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో ర్యాలీలు నిర్వహించాలన్నారు. ఈనెల 16న జోన్-1, 2 పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో సంఘీభావ ర్యాలీలు చేయాలన్నారు. రాజధాని అమరావతి ఆవశ్యకతను అందరికీ చాటి చెప్పాలని ఆయన పేర్కొన్నారు.