ఆస్పత్రిలో గ్లౌసులు, మాస్కులు ఇవ్వకపోవడంతో ఏపి ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకే తనపై తప్పుడు కేసులు పెట్టి చిత్రహింస లకు గురిచేశారని గతంలో ఆరోపణలు చేసిన విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం ప్రాంతీయ ఆస్పత్రి మత్తు వైద్య నిపుణులు సుధాకర్ నిన్న అర్ధరాత్రి గుండెపోటుతో మృతి చెందారు. ఈ విషయాన్ని ఆయన కుటంబసభ్యులు పేర్కొన్నారు.ఆయన మృతి పట్ల నారా లోకేష్ సంతాపం వ్యక్తం చేశారు. “డాక్టర్ సుధాకర్ గారి మృతి నన్ను తీవ్రదిగ్ర్భాంతికి గురిచేసింది. మాస్క్ అడగడమే దళిత వైద్యుడు చేసిన నేరంగా జగన్ ఆదేశాలతో రెక్కలు విరిచి కట్టి, కొట్టి, నానా హింసలు పెట్టి పిచ్చాసుపత్రిలో చేర్పించడంతో సుధాకర్ బాగా కుంగిపోయారని తెలిసింది.
ఒక సామాన్య వైద్యుడిని వెంటాడి వేధించి చివరికి ఇలా అంతమొందించారు. ఇది గుండెపోటు కాదు. ప్రశ్నించినందుకు ప్రభుత్వం చేసిన హత్య ఇది. నిరంకుశ సర్కారుపై పోరాడిన సుధాకర్ గారికి నివాళి అర్పిస్తున్నాను.ఆయన కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను.” అని లోకేష్ పేర్కొన్నారు.