బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ మృతి నేపథ్యంలో ఆదిత్య ఠాక్రే పేరును ప్రస్తావించకుండా బేబీ పెంగ్విన్ అంటూ కంగన సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. పీఓకే వ్యాఖ్యలతో కంగన- శివసేనల మధ్య తలెత్తిన మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. శివసేన ఎంపీ, ముఖ్యనేత సంజయ్ రౌత్ విమర్శలకు స్పందించిన కంగన.. భారీ భద్రత నడుమ ముంబైలో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. అయితే అప్పటికే బీఎంసీ అధికారులు పాలిలోని ఆమె ఆఫీసులో అక్రమ నిర్మాణాలు ఉన్నాయంటూ కూల్చివేత ప్రారంభించారు. దీంతో కంగన కోర్టును ఆశ్రయించగా స్టే విధించింది. కంగన సోమవారం ముంబైని వీడి స్వస్థలం మనాలికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో కంగన రనౌత్కు కేంద్రం కల్పిస్తున్న ‘వై’ కేటగిరీ భద్రతపై సుప్రీంకోర్టు న్యాయవాది బ్రిజేష్ కలప్ప విమర్శలు కురిపించారు. ఒక మనిషికి నెల రోజులపాటు భద్రత కల్పించేందుకు కేంద్రానికి 10 లక్షల రూపాయలు అవుతుందని, ప్రజల నుంచి వసూలు చేసే పన్నులను ఇలాంటి వాటికి ఉపయోగించడం తగదని కలప్ప ట్వీట్ చేశారు. కంగన ఇప్పుడు హిమాచల్ప్రదేశ్లో సురక్షితంగా ఉన్నారు కాబట్టి సెక్యూరిటీని ప్రభుత్వం వెనక్కి తీసుకుంటుందా? అని ప్రశ్నించారు. కలప్ప ట్వీట్పై స్పందించిన కంగన తనకు ప్రభుత్వమేమీ ఊరికనే భద్రత కల్పించలేదని, ఇంటెలిజెన్స్ బ్యూరో తనకు అపాయం పొంచి ఉందా? లేదా? అన్న విషయాన్ని విచారించిన తర్వాతే ప్రభుత్వం తనకు భద్రతను కేటాయించిందని పేర్కొన్నారు. దేవుడి దయ ఉంటే భవిష్యత్తులో ఈ భద్రత పూర్తిగా తొలగిపోతుందని, లేదంటే తనకు ఇంకా ముప్పు పొంచి ఉందని భావిస్తే భద్రతను మరింత పెంచే అవకాశం కూడా ఉందని కంగన బదులిచ్చారు.
previous post