ఏపీ ఎన్నికల మాజీ కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ తొలగింపుపై ఆయన హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఆయనతో పాటు మరో 11 మంది కూడా ఇదే విషయాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఆ పిటిషన్లపై హైకోర్టు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ రోజు విచారణ జరిపింది. ఆయన తొలగింపుపై ప్రభుత్వం వివరణ ఇచ్చింది. నిమ్మగడ్డ వేసిన పిటిషన్లపై కూడా విచారణ జరిపిన న్యాయస్థానం, ఆయన పదవీ కాలం కుదింపు వ్యాజ్యంపై తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది.
సోమవారం నేరుగా హైకోర్టులోనే విచారణ జరగనుంది. బౌతిక దూరం పాటిస్తూ విచారణకు అందరూ సహకరించాలని ఆదేశించింది. కేసుకు సంబంధించిన న్యాయవాదులను మాత్రమే అనుమతిస్తామని తెలిపింది. ఇందుకోసం పిటిషనర్లు, న్యాయవాదులకు హైకోర్టు ప్రత్యేక పాసులు జారీ చేస్తామని, సదరు పాస్లు ఇవ్వాల్సిందిగా డీజీపీకి లేఖ రాస్తామని పేర్కొంది. విచారణ సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్లోకి ఇతరులు రావడంపై హైకోర్టు చివాట్లు పెట్టినట్లు తెలిసింది.