ఉపరితల ద్రోణి కారణంగా తెలంగాణలో నిన్న ఈదురు గాలులతో కురిసిన భారీ వర్షాలకు వేలాది ఎకరాల్లో పంట నష్టం జరిగింది. ఈదురుగాలులకు చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. దీంతో చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. రాత్రి వరకు రాష్ట్రవ్యాప్తంగా 382 ప్రాంతాల్లో వర్షాలు కురిసినట్టు వాతావరణ విభాగం అధికారులు తెలిపారు. కొన్ని చోట్ల ఈదురుగాలులు, వడగళ్ల వానలు కురిశాయి. మరికొన్ని చోట్ల భారీ వర్షాలు పడ్డాయి. పిడుగులు పడి వేర్వేరు చోట్ల ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు.
హైదరాబాద్లో మాత్రం నిన్న మధ్యాహ్నం వాతావరణం అకస్మాత్తుగా మారిపోయి ఒక్కసారిగా మేఘావృతమైంది. ఆ వెంటనే వర్షం కురిసి ఎండవేడికి అల్లాడుతున్న ప్రజలకు బోల్డంత ఉపశమనం కలిగించింది. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని కుందారంలో అత్యధికంగా 10.7 సెంటీమీటర్ల వర్షం పడగా, ములుగు జిల్లా మంగపేటలో 9.8, పటాన్చెరులో 7.2, ఈసలతక్కళ్లపల్లిలో 7.2, మారేడుపల్లిలో 6.9, మల్యాలో 6.8, హయత్నగర్లో 6.7, దుమ్ముగూడెంలో 6.2, భద్రాచలంలో 6.1, జిన్నారంలో 5.5, కూకట్పల్లిలో 5.4, ఆరుట్లలో 5.4 సెంటీమీటర్ల వర్షం కురిసింది.