కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ప్రియాంకగాంధీ వాద్రా బీజేపీ నాయకులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. మహిళలను లైంగికంగా వేధించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీని, ఆ పార్టీ నేతలను బహిష్కరించాలని ఆమె మహిళలకు పిలుపునిచ్చారు.మొదట కుల్దీప్ సింగ్ సెంగార్…తర్వాత స్వామి చిన్మయానంద, ఇప్పుడు గోపాల్ కందా…ఆత్మగౌరవం ఉన్న ప్రతీ భారతీయ మహిళ బీజేపీని, ఆ పార్టీ నాయకులను బహిష్కరించాలి…బీజేపీ నేతలు ఎప్పుడైనా మహిళలను గౌరవించారా? అని ప్రియాంకగాంధీ ట్వీట్ చేశారు.
ఉన్నవోలో ఓ బాలికపై అత్యాచారం చేసిన కేసులో బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్ నిందితుడు. ఈయన్ని అరెస్టు చేశాక, బీజేపీ అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. కేంద్ర మాజీమంత్రి, బీజేపీ నాయకుడైన స్వామి చిన్మయానంద ఓ న్యాయ విద్యార్థినిని లైంగికంగా వేధించి అరెస్టయ్యారు. 2012లో తన విమానయాన సంస్థలో పనిచేసిన ఎయిర్ హోస్టెస్ ఆత్మహత్యకు గోపాల్ కందా కారణమని ఆరోపణలు వచ్చాయి. కొన్ని నెలల తర్వాత ఎయిర్ హోస్టెస్ తల్లి కూడా ఆత్మహత్య చేసుకుంది. గోపాల్ కందా మద్ధతుతో హర్యానాలో బీజేపీ సర్కారు ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో ప్రియాంకగాంధీ ఈ వ్యాఖ్యలు చేశారు.