నేడు హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు ఉండనున్నాయి. దీనికి కారణం, సిక్కుల గురువు సంత్ శ్రీగురుగోవింద్ సింగ్ జన్మదినం సందర్భంగా వారు పెద్ద సంఖ్యలో గౌలిగూడలోని గురుద్వారా సందర్శించుకొని ప్రార్థనలు నిర్వహించనున్నారు. ఈ ర్యాలీని పురస్కరించుకొని గౌలిగూడలోని గురుద్వారా పరిసర ప్రాంతాలలో ట్రాఫిక్ ఆంక్షలుంటాయని అడిషనల్ సీపీ ట్రాఫిక్ అనిల్కుమార్ తెలిపారు. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకూ గురుద్వారా పరిసర ప్రాంతాలలో ఈ ఆంక్షలు అమలులో ఉంటాయని తెలిపారు.
సెంట్రల్ గురుద్వారా సాహెబ్ నుంచి అశోక్బజార్, గురునానక్ మార్గ్, అఫ్జల్గంజ్ జంక్షన్, సిద్ధి అంబర్బజార్, మొహింజాహిమార్కెట్, జాంబాగ్, పుత్లీబౌలీ మీదుగా సాగే ఈ యాత్రలో సుమారు 2000లకు పైగా సిక్కులు పాల్గొనే అవకాశముంది. ర్యాలీ సెంట్రల్ గురుద్వారా నుంచి ప్రారంభమైన సమయంలో అఫ్జల్గంజ్ నుంచి సీబీఎస్, శంకర్శేర్ హోటల్ వైపునకు వాహనాలను అనుమతించరు.
* శివాజీ బ్రిడ్జి జంక్షన్, ఎస్జే బ్రిడ్జి రోటరీ నుంచి సీబీఎస్కు వెళ్లాల్సి ఉంటుంది.
* ర్యాలీ అఫ్జల్గంజ్ జంక్షన్ ప్రాంతానికి చేరినప్పుడు అఫ్జల్గంజ్ నుంచి సీబీఎస్ వెళ్లే వాహనాలను సెంట్రల్ లైబ్రరీ వైపునకు మళ్లిస్తారు.
* ర్యాలీ ఎంజే మార్కెట్ను సమీపించినప్పుడు చాదర్ఘాట్ నుంచి రంగమహల్ వైపునకు వెళ్లే వాహనాలను సీబీఎస్ వైపునకు మళ్లిస్తారు.
* ర్యాలీ అఫ్జల్గంజ్ ప్రాంతానికి చేరినప్పుడు సిటీ కాలేజ్, మదీనా నుంచి అఫ్జల్గంజ్ వైపునకు అనుమతించరు. ఆ సమయంలో వాహనదారులు నయాపూల్ నుంచి సాలార్జంగ్ మ్యూజియం ఎస్జే రోటరీ వైపునకు వెళ్లాల్సి ఉంటుంది.
* ర్యాలీ శాంతిఫైర్ వర్క్ను సమీపించినప్పుడు అఫ్జల్గంజ్ నుంచి ఎంజే మార్కెట్ వైపునకు వాహనాలను అనుమతించరు. ఫీల్ఖానా, తోప్ఖానా మీదుగా ఎంజే మార్కెట్కు వెళ్లాల్సి ఉంటుంది.
* ర్యాలీ జరుగుతున్న ప్రాంతాలలో రద్దీని తగ్గించేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని ట్రాఫిక్ సిబ్బంది వాహనదారులకు విజ్ఞప్తి చేశారు.
ఎగ్జిట్ పోల్స్ ను పట్టించుకోవడం లేదు: లక్ష్మీనారాయణ