మాదిగలకు నమ్మకద్రోహం చేసిన ఏపీ సీఎం చంద్రబాబుకు ఓటు ద్వారా రాజకీయ శిక్ష వేస్తామని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ పేర్కొన్నారు.బుధవారం ఆయన మాట్లాడుతూ సీట్ల కేటాయింపులో టీడీపీ మాలలకే పెద్ద పీట వేసిందని మండిపడ్డారు. దళితులు విషయంలో నిర్లక్ష్యం చూపుతున్న చంద్రబాబును.. రానున్న ఎన్నికల్లో తగిన బుద్ధి చెపుతామని హెచ్చరించారు.
అమరావతిలో విశ్వరూప మహాసభకు అనుమతి నిరాకరణను ఖండిస్తున్నామని తెలిపారు. ఎవరైనా దళితులుగా పుట్టాలని కోరుకుంటారా అంటూ ఏకంగా చంద్రబాబు చేసిన వ్యాఖ్యల పై మండిపడ్డారు. దళితులకు రాజకీయాలు ఎందుకంటూ పార్టీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అసభ్యకర పదజాలంతో దూషించారని ఆరోపించారు. ఈ విధంగా అధికార పార్టీ అహంకారానికి తార్కాణంగా నిలిచిన ఘటనలు ఇంకెన్నో ఉన్నాయన్నారు. ఈనెల29న తమ రాజకీయ భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని మందకృష్ణ తెలిపారు.