బీజేపీ తో తమ వైఖరి ఎలా ఉండబోతుందో భవిష్యత్తులో చేతలతోనే చూపిస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. కర్నూలు నగరంలో జరిగిన పార్టీ సమీక్ష సమావేశం సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీతో స్నేహంగానే ఉండాలని జనసేన అధినేత పవన్కల్యాణ్ చెప్పడం ఆయన వ్యక్తిగతం అన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం 2014 ఎన్నికల సమయంలో జనసేన, టీడీపీ బీజేపీతో స్నేహం చేసిన విషయం అందరికీ తెలిసిందే అన్నారు. అయితే రాష్ట్భ్రావృద్ధికి కేంద్రం సహకరించలేదన్న కారణంతో బీజేపీకి దూరమయ్యామన్నారు. ఇటీవల జనసేనాని పవన్కల్యాణ్ ఈనాటి రాజకీయాలకు అమిత్షానే కరెక్ట్ అని బీజేపీకి తాను దూరం కాలేదని పేర్కొనడంపై మీడియా ప్రస్తావించగా రాజకీయాల్లో జనసేన వైఖరి జనసేనదే అని…అలాగే తమ వైఖరి ఏమిటన్నది భవిష్యత్తులో తెలుస్తుందన్నారు బాబు.
రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వస్తే రాక్షస పాలన వస్తుందని తాము హెచ్చరించినా ప్రజలు ఓట్లు వేశారని, కొన్ని రాజకీయ పార్టీలు వైసీపీకి సహకరించాయని ఆయన ఆరోపించారు. ప్రస్తుతం జరుగుతున్న వ్యవహారాన్ని ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్న చంద్రబాబు తన నవరత్నాలను, కార్యకర్తలను కాపాడడం కోసం జగన్ ప్రభుత్వ ఆస్తులను అమ్మకానికి పెట్టారని మండిపడ్డారు. తాగుబోతులు సంపదను సృష్టించుకోకపోగా తండ్రులు, తాతలు సంపాదించిన ఆస్తులను అమ్మి ఆనందాన్ని పొందుతారని అదే తరహాలో జగన్ పాలన కొనసాగుతోందన్నారు. అభివృద్ధి కార్యక్రమాలను పక్కనపెట్టి దోచుకోవడం, ప్రజల ఆస్తులను అమ్ముకోవడం లాంటి చర్యలు జగన్ చేపట్టిన విషయాన్ని అన్ని రాజకీయ పార్టీలు గుర్తించాయని, ఏదో ఒక రోజున ప్రజలు ప్రభుత్వం నడ్డి విరగ్గొట్టడం ఖాయమని బాబు జోస్యం చెప్పారు.
చంద్రబాబు ఇంకా తానే సీఎం అనే అపోహలో ఉన్నారు: హోం మంత్రి సుచరిత