telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు

నల్లా బిల్లులు సకాలంలో చెల్లించకపోతే.. నోటీసులు జారీ చేస్తున్నాం.. : జలమండలి ఎండీ దానకిశోర్‌

no drinking water supply for 2 days ghmc

నల్లా నీటి బిల్లులు సకాలంలో చెల్లించని వారికి రెడ్‌ నోటీసులు జారీ చేసి, ఆయా కనెక్షన్‌ను తొలగించనున్నట్లు జలమండలి ఎండీ దానకిశోర్‌ హెచ్చరించారు. 50వేలకు పైగా ఉన్న కనెక్షన్ల నుంచి బిల్లులు వసూలు చేయడంపై క్షేత్రస్థాయి అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. బోర్డు రెవెన్యూ పెంపొందించేందుకు జలమండలి వీడీఎస్‌-19, ఇంటింటి సర్వే, వాక్‌ వంటి కార్యక్రమాలు సత్ఫలితాలను ఇస్తున్నట్లు ఎండీ దానకిశోర్‌ పేర్కొన్నారు. బుధవారం ఖైరతాబాద్‌ జలమండలి ప్రధాన కార్యాలయంలో ఉన్నతాధికారులతో రెవెన్యూ, వీడీఏస్‌-19, ఇంటింటి సర్వే, సనత్‌నగర్‌ ఫైలెట్‌ ప్రాజెక్టు, వాక్‌, జీఐఎస్‌ వంటి వాటిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. జలమండలి రెవెన్యూ పెంచేందుకు చేపట్టిన ఇంటింటి సర్వే, వీడీఎస్‌ 2019 ద్వారా జలమండలి రెవెన్యూ పెరిగినట్లు తెలిపారు. వాక్‌ కార్యక్రమంలో వినియోగదారుల ఇంటి ప్రాంగణంలో నీటి కొంత మేర తగ్గించడం, ఎన్‌ఆర్‌డబ్ల్యూ వంటివి విజయవంతం అవుతున్నాయని వివరించారు.

బిల్లుల జారీ చేసి మిన్నకుండకుండా, వంద శాతం వసూళ్లు అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని కిశోర్‌ చెప్పారు. అక్రమ నల్లా కనెక్షన్లను క్రమబద్ధీకరించుకోవడానికి ప్రవేశపెట్టిన వీడీఎస్‌-19 కార్యక్రమానికి మరింత ప్రచారం కల్పించాలని సూచించారు. స్థానిక ఎమ్మెల్యేలు, కార్పొరేటర్ల సాయంతో ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని వివరించారు. ఎంపిక చేసిన ప్రాంతాల్లో క్యాంపులు ఏర్పాటు చేసిన వీడీఎస్‌ దరఖాస్తులు స్వీకరించేలా ఏర్పాటు చేయాలని మేనేజర్లను ఆదేశించారు. సనత్‌నగర్‌లో ప్రవేశపెట్టిన ఫైలెట్‌ ప్రాజెక్టుపై సమీక్షించారు. ప్రాజెక్టులో భాగంగా చేపడుతున్న 360 డిగ్రీస్‌ ఇంటింటి సర్వే, ఎమ్మార్‌ మీటర్ల తనిఖీలు, క్యాన్‌ నంబర్లకు భవన ఫొటోల అనుసంధానం పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వీడీఎస్‌-2019పై రూపొందించిన పోస్టర్లు, కరప్రతాలను ఎండీ ఆవిష్కరించారు. ఈ సమావేశంలో జలమండలి ఈడీ డాక్టర్‌ ఎం.సత్యనారాయణ, డైరెక్టర్లు అజ్మీరా కృష్ణ, పి.రవి, శ్రీధర్‌ బాబు, వీఎల్‌ ప్రవీణ్‌కుమార్‌లతో పాటు సీజీఎం, జీఎంలు పాల్గొన్నారు.

Related posts