ట్విటర్ సంస్థ అసత్య వార్తలు, ప్రభుత్వ అనుకూల వార్తలను వ్యాపింపచేసే వేలాది ఖాతాలను తొలగించింది. వీటిలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, చైనా, స్పెయిన్కి చెందినవి ఎక్కువగా ఉన్నట్లుగా కంపెని తెలిపింది. చైనా నుంచి హాంకాంగ్లో నిరసన చేస్తున్న ఆందోళనకారుల గురించి, సౌదీకి అనుకూలంగా ఈజిప్ట్ నుంచి, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కు అనుకూలంగా ఖతార్, యెమెన్ నుంచి అదే విధంగా స్పెయిన్, ఈక్వెడార్ నుంచి నిర్వహిస్తున్న నకిలీ ఖాతాలను తొలగించినట్లు ట్విటర్ ఒక ప్రకటనలో తెలిపింది.
హాంకాంగ్ నిరసనకారులపై వార్తలు వ్యాపింప చేస్తున్న 4302 నకిలీ ఖాతాలను తొలగించామని, అవన్నీ చైనాకు చెందినవిగా భావిస్తున్నాం అని ట్విటర్ తెలిపింది. గత ఆగస్టులో కూడా ట్విటర్ హాంకాంగ్లో నిరసనలకు ఆజ్యం పోస్తున్న చైనాకు చెందిన 2,00,000 నకిలీ ఖాతాలను తొలగించింది. ప్రభుత్వ వ్యక్తులు ట్విటర్ని ఉపయోగించి ప్రజలపై ఏ విధంగా ప్రభావం చూపగలుగుతున్నారో తెలుసుకోనే పనిలో భాగంగా కంపెనీ ఈ సమాచారాన్ని వెల్లడించింది. గత నెలలో ఫేస్బుక్ కూడా ఈజిప్ట్, సౌది అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, లిబియా, సుడాన్, యెమెన్ నుంచి ప్రముఖ మత స్థావరాల గురించి తప్పుడు వార్తలు వ్యాపింప చేస్తున్న పలు నకిలీ ఖాతాలను తొలగించింది.