ఇటీవలి ఎన్నికల్లో అమేథి లోక్ సభ స్థానం నుంచి బరిలోకి దిగిన రాహుల్ గాంధీనీ ఓడించిన స్మృతీ ఇరానీ అక్కడి ప్రజలకు అందుబాటులో ఉండేందుకు సొంత ఇంటికి ముహూర్తం పెట్టేశారు. 2004 నుంచి 2019 వరకూ, పదిహేను సంవత్సరాల పాటు అమేథి లోక్ సభ ఎంపీగా ఉన్న రాహుల్ గాంధీ చేయలేకపోయిన పనిని లోక్ సభకు ఎన్నికైన నెలరోజుల వ్యవధిలోనే సొంత నివాసం ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించారు.
స్థానిక గౌరీగంజ్ ప్రాంతంలో స్థలాన్ని తీసుకున్నానని, ఇక్కడే తన శాశ్వత నివాసం ఉండబోతుందని ఆమె అన్నారు. అమేథిలోనే తాను నివాసాన్ని ఏర్పరచుకుంటానని గతంలో పలుమార్లు చెప్పిన రాహుల్, ఇంతవరకూ ఆ పని మాత్రం చేయలేదు. ఇక స్మృతీ తీసుకున్న నిర్ణయంపై బీజేపీ శ్రేణులు పొగడ్తలు కురిపిస్తున్నాయి. తనను ఆదరించిన అమేథి ప్రజలతో ఆమె మమేకపై పోవాలని భావిస్తున్నారని, ఇకపై కాంగ్రెస్ పార్టీ ఇక్కడి నుంచి విజయం సాధించే అవకాశం ఉండదని అంటున్నారు.