తనను కరిచిన పాముపై ఓ వ్యక్తి పగ తీరుచుకున్నాడు. తాగిన మైకంలో దానిని కొరికి ముక్కలు చేశాడు. అనంతరం తనను కాపాడాలంటూ ఆస్పత్రికి వెళ్లి వైద్యులను ప్రాధేయపడ్డాడు. ఈ విచిత్ర ఘటన ఉత్తరప్రదేశ్లోని ఇతా జిల్లాలో చోటుచేసుకుంది. రాజ్ కుమార్ అనే వ్యక్తి ఆదివారం రాత్రి నిద్రపోతున్న సమయంలో వాళ్ల ఇంట్లో పాము దూరింది.
ఈ క్రమంలో మత్తులో జోగుతున్న అతడిని పాము కాటువేసింది. దీంతో కోపోద్రిక్తుడైన రాజ్ కుమార్ దానిని నోట్లో పెట్టుకుని ముక్కలు ముక్కలు చేశాడు. అనంతరం గట్టిగా కేకలు వేస్తూ ఆస్పత్రికి పరుగులు తీశాడు. మద్యం మత్తులో తమ కుమారుడు ఇలా చేశాడని రాజ్ కుమార్ తండ్రి ఆందోళన వ్యక్తం చేశారు. ఆసుపత్రిలో రాజ్ కుమార్ పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.