telugu navyamedia
క్రైమ్ వార్తలు తెలంగాణ వార్తలు

మహిళలను వివస్త్రను చేసి నడిరోడ్డుపై ఊరేగించిన తండావాసులు

సూర్యాపేట మండలం, రాజునాయక్ తండ లో దారుణం చోటు చేసుకుంది. హత్య కేసులో నిందితురాలిగా ఉన్న ఓ మహిళను మృతుని కుటుంబ సభ్యులు ప్రతీకారంతో గ్రామంలో అందరూ చూస్తుండగా వివస్త్రను చేసి కర్రలతో కొట్టారు. శనివారం జరిగిన ఈ దారుణం ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేట మండలం రాజునాయక్‌తండాకు చెందిన శంకర్‌నాయక్‌ జూన్‌ 13న హత్యకు గురయ్యారు. ఆ ఊరికే చెందిన బాధితురాలు హత్య కేసులో ఒక నిందితురాలిగా అరెస్టయ్యారు.

శంకర్‌నాయక్‌ బంధువులతో ఆమెకు పాతకక్షలున్నాయి. బాధితురాలు ఇటీవల బెయిలుపై విడుదలై సూర్యాపేటలోని తన సోదరి ఇంట్లో తలదాచుకుంటున్నారు. రాజునాయక్‌ తండాకు చెందిన బంధువొకరు శనివారం మృతిచెందడంతో ఆ మహిళ అక్కడికి వెళ్లారు. శంకర్‌నాయక్‌ హత్యానంతరం మొదటిసారిగా తండాకు వచ్చిన ఆమెను చూసి కోపోద్రిక్తులైన అతడి బంధువులు దాడి చేశారు.

ఆమెను ఇంట్లోంచి బయటకు లాక్కొచ్చి వివస్త్రను చేశారు. కళ్లల్లో కారం పోసి, కర్రలతో కొడుతూ నగ్నంగా వీధుల్లో తిప్పారు. నడిరోడ్డులో దాదాపు గంటసేపు జరిగిన ఈ అమానుషాన్ని ఎవరూ అడ్డుకోలేదు. ఎట్టకేలకు వారి నుంచి తప్పించుకున్న బాధిత మహిళ.. ఎంపీటీసీ సభ్యురాలు శాంతాబాయి ఇంటికి పరుగులు తీసింది. శాంతాబాయి ఆమెకు దుస్తులిచ్చి గదిలో రక్షణ కల్పించారు. విషయం తెలిసి పోలీసులు తండాకు వచ్చారు. ఉద్రిక్త పరిస్థితుల నడుమ బాధితురాలిని సూర్యాపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Related posts