కాంగ్రెస్ నేత విజయశాంతి మరోసారి తెలంగాణ సీఎం కేసీఆర్ పై తీవ్రంగా విమర్శలకు దిగారు. తన వరకూ వస్తే కానీ కేసీఆర్కు తత్వం బోధ పడలేదని ఆమె ఎద్దేవా చేశారు. జాతీయవాదాన్ని రెచ్చగొట్టి మోదీ గెలిచారని కేసీఆర్ పేర్కొంటున్నారని కానీ కేసీఆర్ తెలంగాణ వాదాన్ని రెచ్చగొట్టి గెలిచారన్నది వాస్తవం కాదా? అంటూ ఫేస్బుక్ వేదికగా నిలదీశారు. అభివృద్ధితో పని లేదని, సెంటిమెంటును అస్త్రంగా చేసుకుని గెలవొచ్చని కేసీఆర్ అంటున్నారని, 2014లో కూడా అదే సెంటిమెంటుతో గెలిచారని విజయశాంతి పేర్కొన్నారు.
కేసీఆర్ ఇటీవల జరిగిన ఎన్నికల్లోనూ సెంటిమెంటు ద్వారానే లబ్ధి పొందారని విమర్శించారు. కేసీఆర్ చేస్తున్న కామెంట్లను చూస్తుంటే ఆయనకు ఎన్నికల భయం పట్టుకుందని స్పష్టమవుతోందన్నారు. జమిలి ఎన్నికలకు మద్దతు పలికిన కేసీఆర్, అసెంబ్లీతోపాటు లొక్సభకూ ఎన్నికలు జరిగితే మోదీ సెంటిమెంటును వాడుకుంటే టీఆర్ఎస్ ఏం చేస్తుందని విజయశాంతి ప్రశ్నించారు.