బిశ్వ భూషణ్ హరిచందన్ ఏపీకి నూతన గవర్నర్ గా నియమించిన విషయం తెలిసిందే. ఆయనకు విజయవాడలోని పాత సీఎం క్యాంపు కార్యాలయాన్ని కేటాయించారు. ఆ కార్యాలయాన్ని రాజ్ భవన్ గా మార్పు చేయనున్నారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. తాజాగా, గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శిగా ఉన్న ముఖేశ్ కుమార్ మీనాకు గవర్నర్ కార్యదర్శిగా అదనపు బాధ్యతలు అప్పగించారు.
ఈ సందర్భంగా ముఖేశ్ కుమార్ మీనా మాట్లాడుతూ, రేపటి నుంచి రాజ్ భవన్ భద్రతను పెంచుతామని అన్నారు. భవనం గ్రౌండ్ ఫ్లోర్ లో ఆఫీసు రూమ్, మొదటి అంతస్తులో గవర్నర్ నివాసం ఉంటుందని చెప్పారు. ఈ నెల 23న బిశ్వభూషణ్ తిరుపతికి వెళ్తారని, అదే రోజు సాయంత్రానికి విజయవాడలోని రాజ్ భవన్ కు చేరుకుంటారని చెప్పారు. ఈ నెల 24న ఉదయం పదకొండు గంటల తర్వాత గవర్నర్ గా ఆయన ప్రమాణస్వీకారం చేస్తారని చెప్పారు.