అమెరికన్ విమానాల ప్రయాణాలను ఇరాన్ గగనతలంపై నిషేధిస్తూ అమెరికా ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్ఎఎ) విమానయాన సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది. ఇరాన్ గగనతలంపై సంచరిస్తున్న డ్రోన్ను ఇరాన్ దళాలు కూల్చివేసిన నేపథ్యంలో ఎఫ్ఎఎ ఈ ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం అమెరికా – ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు, మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న సైనిక కార్యకలాపాలు పౌర విమానయానానికి తీవ్ర విఘాతం కలిగిస్తున్నాయని ఈ సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. ఇరాన్ గగనతలం మీదుగా విమానాల ప్రయాణాన్ని నిషేధించటంతో ఉత్తర, అమెరికా నుండి తూర్పు ఆసియా దేశాలకు వచ్చే విమానాలపై తీవ్ర ప్రభావం పడనుంది. డ్రోన్ కూల్చివేత నేపధ్యంలో అమెరికాకు చెందిన యునైటెడ్ ఎయిర్లైన్స్ సంస్థ న్యూయార్క్ నుండి ముంబయి వచ్చే తమ విమాన సర్వీసులను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.
ఇరాన్ గగనతలం మీదుగా ప్రయాణించే తమ విమాన సర్వీసులను మార్గంలో భద్రత, సురక్షిత పరిస్థితులను సమీక్షించిన అనంతరం పున్ణప్రారంభిస్తామని వెల్లడించింది. అంతకు ముందు అమెరికన్ ఎయిర్లైన్స్, డెల్టా ఎయిర్లైన్స్ సంస్థలు తమ విమానాలు ఇరాన్ గగనతలం మీదుగా ప్రయాణించబోవని ప్రకటించాయి.