ఇటు తెలుగు, అటు తమిళంతో భాషల్లో విశేష ఆదరణ పొందిన నటుడు సూర్య. ఆయన నటించిన తాజా చిత్రం “ఎన్జీకే” మే 31న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమా విడుదలకు ముందే రికార్డులు సృష్టిస్తోంది. సౌత్ కొరియాలో తొలిసారి విడుదల కానున్న తమిళ చిత్రం ఇదే కాగా, జూన్ 1న సౌత్ కొరియా రాజధాని సియోల్లో ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఇదిలా ఉండగా… ప్రస్తుతం థియేటర్స్ దగ్గర సూర్య అభిమానుల హంగామా నడుస్తుంది. డప్పులు, పాలాభిషేకాలతో తమ ఆరాధ్య నటుడిపై ప్రేమని చాటుకుంటున్న సూర్య అభిమానులు ఈ సారి తిరుత్తణి- చెన్నై బైపాస్ రోడ్డు మార్గంలో 215 అడుగుల సూర్య కటౌట్ ఏర్పాటు చేశారు. తమిళనాడు తిరువళ్లూరు జిల్లాకి చెందిన సూర్య ఫ్యాన్స్ ఈ కటౌట్ కోసం సుమారు రూ.7 లక్షలు ఖర్చు పెట్టారట. 35 రోజుల పాటు, సుమారు 40 మంది కార్మికులు ఈ కటౌట్ని ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది. గతంలో అజిత్ ఫ్యాన్స్ ఏర్పాటు చేసిన 180 అడుగుల కటౌట్ దేశంలోనే అతిపెద్దదిగా రికార్డు నమోదు చేయగా, ఇప్పుడు సూర్య కటౌట్ దానిని బ్రేక్ చేసింది. సూర్య, సాయి పల్లవి, రకుల్ ప్రీత్ సింగ్ ప్రధాన పాత్రలలో సెల్వ రాఘవన్ తెరకెక్కించిన చిత్రం “ఎన్జీకే”కి యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు. డ్రీమ్ వారియర్స్ పిక్చర్స్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది.
previous post