తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ప్రణయ్ పరువు హత్య కేసులో నిందితులకు తెలంగాణ హైకోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ప్రధాన నిందితులైన అమృత తండ్రి మారుతీరావు, ఆయన సోదరుడు శ్రవణ్కుమార్, మరో నిందితుడు కరీంలకు నిన్న న్యాయస్థానం బెయిల్ ఇచ్చింది. తాజాగా ఈ వ్యవహారంపై ప్రణయ్ భార్య అమృత స్పందించారు. తన బాధను ఎవ్వరూ అర్థం చేసుకోలేదని అమృత ఆవేదన వ్యక్తం చేశారు.
గత ఏడాది సెప్టెంబర్ 14వ తేదీన నల్లగొండ జిల్లా మిర్యాలగూడలోని ఓ ఆసుపత్రి వద్ద ప్రణయ్ హత్య జరిగింది. ఐదు నెలల గర్భవతిగా ఉన్న అమృతకు వైద్య పరీక్షలు చేయించేందుకు ఆసుపత్రికి తీసుకెళ్లిన ప్రణయ్పై మామ మారుతీరావు కిరాయి హంతకులతో దాడి చేయించాడు. ఈ కేసులో ప్రధాన నిందితులైన మారుతీరావు, ఆయన సోదరుడు శ్రవణ్కుమార్, మరో నిందితుడు కరీంపై గతేడాది సెప్టెంబరు 18న పోలీసులు పీడీ యాక్టు కింద కేసు నమోదుచేసి అరెస్ట్ చేశారు. అప్పట్లోనే వీరు బెయిల్ కు దరఖాస్తు చేసుకోగా, కేసులో సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశముండటంతో న్యాయస్థానం అందుకు అంగీకరించలేదు.