వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై అమరావతి రైతులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనపై వైసీపీ ఎమ్మెల్యే రోజా ఘాటుగా స్పందించారు. మంగళగిరిలో ఆమె మీడియాతో మాట్లాడుతూ కారు అద్దాలు పగిలిన తీరును చూస్తే… పిన్నెల్లిని చంపేయాలనే ఆలోచనతోనే దాడి చేసినట్టు అర్థమవుతుందని అన్నారు. ఇకపై వైసీపీ ఎమ్మెల్యేలు, నేతలపై దాడి చేస్తే… ఉపేక్షించబోమని హెచ్చరించారు. ప్రజాప్రతినిధులకు ప్రాణభయం కలిగించే విధంగా వ్యవహరిస్తే ఊరుకోబోమని చెప్పారు.
రాష్ట్రంలోని మూడు ప్రాంతాల ప్రజలను విడదీసే ప్రయత్నాన్ని చంద్రబాబు చేస్తున్నారని అన్నారు. అల్లర్లను సృష్టించి, రాజకీయపరంగా అనుకూలంగా మలచుకోవడం చంద్రబాబుకు అలవాటేనని రోజా ఆరోపించారు. రాజధాని తరలింపుపై ఇంతవరకు ముఖ్యమంత్రి జగన్ కానీ ఎలాంటి ప్రకటన చేయలేదన్నారు. రాజధాని నివేదికలపై అసెంబ్లీలో చర్చ తర్వాతే తుది ప్రకటన ఉంటుందని అన్నారు.