telugu navyamedia
ఆంధ్ర వార్తలు

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌పై జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి ప్ర‌సంశ‌లు..

*వెంట్రుక కూడా పీక్కోలేర‌న్న జ‌గ‌న్ వ్యాఖ్య‌ల‌పై జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి కౌంట‌ర్‌ కామెంట్రీ
*వైసీపీ ఎమ్మెల్యేల‌కు ఉద్దేశించి జేసీ వ్యాఖ్య‌లు..
*తిరుమలలో వైవీ సుబ్బారెడ్డి వచ్చాక భక్తులకు దైవదర్శనం కరువైంది..
*రెండేళ్లు అయ్యింది తిరుమ‌ల వెళ్ళి..తాము ఇంట్లో నుంచి మొక్కుంటున్నామన్నారు.
*జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌పై జేసీ ప్ర‌సంశ‌లు

నంద్యాల సభలో సీఎం జగన్ వెంట్రుక పీక్కోలేరు అన్న మాట వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులను ఉద్దేశించి అన్నదేనని అనంతపురం జిల్లా టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు.

తాడిపత్రిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. కేబినేట్ మారుస్తున్నా.. ప‌ద‌వులు ఇచ్చిన వారే మంత్రులు.. మిగతావారు నా వెంట్రుక పీకలేరని అర్థం వచ్చేలా మాట్లాడారని విశ్లేషించారు.సీఎం కామెంట్స్‌పై వైసీపీ ఎమ్మెల్యేలు ఆలోచించుకోవాలన్నారు. అయితే విద్యాదీవెన పేరిట విద్యార్థులతో సభ ఏర్పాటు చేసిన చోట.. ముఖ్యమంత్రి అలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు.

టీటీడీలో జరుగుతున్నది ఏంటి… సుబ్బారెడ్డి ఏమిచేస్తున్నారని జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రశ్నించారు. రెండేళ్ల తర్వాత తిరుమలకు వెళ్తే భక్తులకు ఇన్ని అవస్థలా? అంటూ జేసీ ప్రభాకర్‌ రెడ్డి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తిరుమలలో వైవీ సుబ్బారెడ్డి వచ్చాక భక్తులకు దైవదర్శనం కరువైందన్నారు. ఏదో మంచి చేస్తారని అధికారం ఇచ్చిన ప్రజలను ముప్పుతిప్పలు పెడుతున్నారని మండిపడ్డారు.

పవన్ కల్యాణ్‌పై జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రశంసలు కురిపించారు. కౌలురైతులకు పవన్‌ కల్యాణ్‌ ఆర్థికసాయం చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ వస్తేనే ఏపీలో సమస్యలు పరిష్కారం అవుతున్నాయన్నారు.అందరం కలిసి ప్రజల కోసం పని చేయాలన్నారు.

పవన్ రైతు భరోసా చేపట్టగానే బాధితులకు ప్రభుత్వం పరిహారం అందించిందన్నారు. పవన్ కల్యాణ్ వస్తే కానీ ఆత్మహత్య చేసుకున్న రైతులకు పరిహారం ఇవ్వరా అంటూ వైఎస్ఆర్‌సీపీ సర్కార్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు . పవన్ తాడిపత్రి పట్టణానికి రావాలని విజ్ఞప్తి చేస్తున్నానన్నారు. రాష్ట్రవ్యాప్తంగా సమస్యలపై పవన్ పోరాడాలని జేసీ ప్రభాకర్‌రెడ్డి సూచించారు.

 

Related posts