ఏదైనా పరిశ్రమ ఒక ప్రాంతంలో ఏర్పాటు చేస్తే, స్థానికులకు అందులో ఉద్యోగాలు కల్పించాలని ప్రతిపాదన ఎప్పటి నుండో ఉంది. అది ఇప్పటికి కార్యరూపం దాల్చడం విశేషం. తాజాగా మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా అధికారంలోకి వచ్చిన సీఎం కమల్నాథ్ నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కారు సంచలన నిర్ణయం తీసుకుంది. పరిశ్రమల్లో 70 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. తాను ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుకు పరిశ్రమల్లో 70 శాతం ఉద్యోగాలు స్థానిక యువతకు ఇవ్వాలని సీఎం కమల్నాథ్ ట్వీట్ చేశారు.
కొత్త పారిశ్రామిక విధానంలో భాగంగా రాష్ట్రంలోని పరిశ్రమలకు రాయితీలు ఇస్తామని, కాని పరిశ్రమల్లో 70 శాతం మంది ఉద్యోగులను స్థానికులనే నియమించాలని కోరారు. సీఎం ఆదేశాల మేర అన్ని పరిశ్రమల్లో 70 శాతం స్థానికులకు ఉద్యోగాలను తప్పనిసరిగా కల్పించాలని పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ముహమ్మద్ సులేమాన్ కోరారు. నిరుద్యోగం తగ్గించేలా పరిశ్రమల స్థాపనకు పెట్టుబడులను ఆహ్వానించేందుకు ఈ నెల 19వతేదీన పారిశ్రామికవేత్తలతో సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం ఈ సందర్భంగా ప్రకటించారు.