ఇటీవల చంద్రయాన్ ప్రయోగం గురించి బాగా ప్రచారం జరిగింది. దీనితో ప్రపంచం అంతా భారత్ వైపే చూస్తుంది. అసలు చంద్రుడిపైకి మనిషి అడుగుపెట్టి నేటికి 50 ఏళ్లు. జాబిల్లిపై తన చెరగని పాదముద్రను వేసి చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని 1969 జులై 20న లిఖించాడు మానవుడు. మూన్ ల్యాండింగ్కు సంబంధించి అందరూ అపోలో 11 మిషన్, వ్యోమగాముల గురించి మాట్లాడుకుంటారు. అయితే చంద్రుడి ఫొటోలు తీసేందుకు వ్యోమగాములు తీసుకెళ్లిన కెమెరా గురించి మీకు తెలుసా? ఆ కెమెరాను రూపొందించింది స్డీడన్కు చెందిన హస్సెల్బ్లాడ్ సంస్థ.
అప్పటి వ్యోమగాములు హస్సెల్బ్లాడ్ ప్రత్యేకంగా రూపొందించిన హస్సెల్బ్లాడ్ డేటా కెమెరా, ఎలక్ట్రిక్ కెమెరాలను తమతోపాటు తీసుకెళ్లారు. వీటితో జాబిల్లికి సంబంధించిన స్పష్టమైన ఫొటోలను తీశారు. ఇప్పుడు ఈ చారిత్రక ఘట్టానికి 50 వసంతాలు పూర్తయిన సందర్భంగా ఆ సంస్థ 907x స్పెషల్ ఎడిషన్ కెమెరాను ఆవిష్కరిస్తున్నట్లు ఆ కంపెనీ ప్రకటించింది. దీని ధర దాదాపు 7,500 డాలర్లు. ఈ కెమెరాను ఎప్పటి నుంచి అందుబాటులోకి తెస్తుందో ఆ కంపెనీ వెల్లడించలేదు.