విజయనగరం జిల్లా కురుపాం మండలం కేంద్రంలో గురువారం అర్ధరాత్రి విషాదం చోటుచేసుకుంది.కురపాంలోని జ్యోతిబాపులే బిసి వెల్ఫేర్ రెసిడెన్షియల్లో గురువారం రాత్రి నిద్రిస్తున్న విద్యార్థులు పాము కాటుకు గురయ్యారు.
రాత్రి సమయంలో హాస్టల్లోకి ప్రవేశించిన నేలపై వరుసగా నిద్రిస్తున్న ముగ్గురు విద్యార్థుల ముఖంపై కాటేసింది. పాము కాటుతో ఈ ముగ్గురు విద్యార్థులు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. ఇది గమనించిన తోటి విద్యార్థులు హాస్టల్ సిబ్బందికి వెంటనే సమాచారం ఇచ్చారు.
అప్రమత్తమైన హాస్టల్ సిబ్బంది పాముకాటుకు గురైన విద్యార్థులను 108 అంబులెన్స్ సహాయంతో పార్వతీపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ ముగ్గురునీ మెరుగైన వైద్యం కోసం విశాఖ ఆసుపత్రికి తరలించారు.
పాముకాటుకు గురైన ముగ్గురు విద్యార్థులు ఎనిమిదవ తరగతి చదువుతున్న మంతిని రంజిత్, ఈదుబుల్లి వంశీ జీగారం, వంగపండు నవీన్ లుగా గుర్తించారు.
ముగ్గురు విద్యార్థుల్లో మంతిని రంజిత్ అనే విద్యార్థి చికిత్స పొందుతూ మృతి చెందాడు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. పాము కాటుతో విద్యార్థి మృతి చెందడంతో పేరెంట్స్ కన్నీరుమున్నీరు అవుతున్నారు.