ఆదిలాబాద్ మంచిర్యాల జిల్లాలోని విషాదం చోటుచేసుకుంది. తనకు ఆడపిల్ల పుడుతుందనే భయంతో ప్రాణం తీసుకుంది గర్భిణి. తొలి కాన్పులో ఆడపిల్ల పుట్టిందని, మళ్లీ ఆడపిల్లే పుడుతుందేమో అనుమానంతో.. కొన్ని గంటల్లో శిశువుకు ప్రాణం పోయాల్సిన ఆ తల్లి బుధవారం రాత్రి ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. పోస్టుమార్టంలో కడుపులో ఉన్నది మగబిడ్డే అని తేలడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.
వివర్లాలోకి వెళితే..
మంచిర్యాల జిల్లాలోని దండేపల్లి మండలం నర్సాపూర్కు చెందిన రమ్య (26) మంచిర్యాలకు చెందిన ఆనంద్.. 2017లో వివాహం చేసుకున్నారు. వీరికి మూడేళ్ల కూతురు ఆరాధ్య ఉంది. తొమ్మిది నెలల క్రితం రమ్య మళ్లీ గర్భం దాల్చడంతో భర్త స్థానికంగా ఉన్న ప్రైవేటు ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయిస్తున్నారు.
15రోజుల క్రితం బోనాల పండుగ కోసం రమ్య భర్తతో కలిసి పుట్టింటికి వెళ్లింది. ప్రసవం అయ్యేంతవరకూ పుట్టింట్లోనే ఉంటానని భర్తతో చెప్పి తల్లి శారద వద్దే ఉండిపోయింది. ఈ నెల 3న వైద్య పరీక్షల కోసం రమ్య తల్లితో కలిసి మంచిర్యాలకు వచ్చింది. విషయం తెలుసుకున్న ఆనంద్ ఆస్పత్రికి చేరుకుని రమ్యను ఇంటికి తీసుకెళ్లే ప్రయత్నం చేయగా నిరాకరించడంతో వెళ్లిపోయారు.ఈ నెల 6వ తేదీకి డెలివరీ డేట్ ఇవ్వడంతో కూతురును అల్లుడి ఇంటికి తీసుకుని వెళ్లి రమ్యను అక్కడే ఉండాలని డాక్టర్ సూచించింది.
గురువారం కాన్పుకోసం ఆస్పత్రికి వెళ్లాల్సిన రమ్య.. తనకు ఆడపిల్ల పుడితే అత్తింటి వారు ఏమంటారోనని ఆందోళన చెంది బుధవారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. రమ్య కడుపులో నుంచి మృతి చెందిన మగ శిశువును వైద్యులు తీశారు. దీంతో తల్లిదండ్రులు రోదిస్తున్న తీరు స్థానికులను కలిచివేసింది.