వంటలు చేయటమంటే అంతా ఆషామాషీ ఏం కాదు. అందులోనే తక్కువ సమయంలో అందరిని మెప్పించేలా వంటలు చేయాలంటే అతిపెద్ద సాహసమే చేయాలి. అయితే తమిళనాడుకు చెందిన ఓ మహిళా 30 నిమిషాల సమయంలో ఏకంగా 134 వంటకాలు సిద్ధం చేసి సరికొత్త రికార్డ్ సృష్టించింది. .
తమిళనాడు రాష్ట్రంలో మధురై జిల్లా తిరుమంగళంకు చెందిన ఇందిరా రవిచంద్రన్ వంటలు చేయటంలో మంచి దిట్ట. ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ అడ్మినిస్ట్రేటర్ పర్యవేక్షణలో తక్కువ సమయంలో ఎక్కువ వంటకాలు చేసి రికార్డుల్లోకి ఎక్కెందుకు తన ప్రయత్నం ప్రారంభించింది.
30 నిమిషాల్లో శాకాహార, మాంసాహార వంటలు కలిపి మొత్తం 134 రకాల ఆహార పదార్థాల ను తయారు చేసింది. ఆమె తయారు చేసిన వాటిలో దోస, ఇడ్లీ, ఆమ్లెట్, ఊతప్ప, ఐస్క్రీమ్, కోడికూర, బిర్యానీ, ఫిష్ కర్రీ వంటి అనేక రుచికరమైన ఆహార పదార్ధాలు ఉన్నాయి. చిన్నతనం నుంచే వంటలపై ఆసక్తి ఉండడంతో ఈ రికార్డు సాధ్యమైనట్టు ఇందిరా రవిచంద్రన్ పేర్కొన్నారు.
ఇంత తక్కువ సమయంలో ఇన్ని వెరైటీలు తయారు చేయటమంటే సాధ్యమయ్యే పనికాదని చాలా మంది భావించారు. అయితే వారి అంచనాలను తలక్రిందులు చేస్తూ ఇందిర అరగంట వ్యవధిలోనే 134 వంటకాలను చేసి చూపించింది.