ఉద్యోగం కోసం ఎదిరిచూస్తున్ననిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో వివిధ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యా పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జిల్లా పరిషత్, ప్రభుత్వ, మున్సిపల్ ఉన్నత పాఠశాలల్లో చదువుతున్న దివ్యాంగ విద్యార్థులకు సమ్మిళిత విద్యను బోధించేందుకు ప్రత్యేక ‘డీఎస్సీ’ నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. ఆయా ఉన్నత పాఠశాలల్లో సమ్మిళిత విద్యాబోధనకు ‘సమగ్ర శిక్షా అభియాన్(ఎస్ ఎస్ ఏ)’ రాష్ట్రానికి 860 స్కూల్ అసిస్టెంట్ పోస్టులను కేటాయించింది. వీటిల్లో 70 శాతం (602) పోస్టులను డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా, 30 శాతం(258) పోస్టులను పదోన్నతి కల్పించడం ద్వారా భర్తీ చేయాల్సి ఉంది. ఇప్పుడు 602 పోస్టుల డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోసం రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధిశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు శుక్రవారం ప్రత్యేక డీఎస్సీ షెడ్యూల్ విడుదల చేశారు.
స్పెషల్ డీఎస్సీ షెడ్యూల్ ఇలా..
ఈ నెల 16న ‘టెట్ కమ్ టీఆర్టీ’ నోటిఫికేషన్ విడుదల. ఈ నెల 25 నుంచి మార్చి 11 వరకూ (15 రోజులు) పరీక్ష ఫీజు చెల్లింపు. ఈ నెల 25 నుంచి మార్చి 12 వరకూ (16 రోజులు) ఆన్లైన్లో దరఖాస్తుల సమర్పణ. ఏప్రిల్ 25 నుంచి 31 వరకూ (7 రోజులు) సెంటర్ల ఆప్షన్. మే 7 నుంచి హాల్ టికెట్ల డౌన్లోడింగ్. రాత పరీక్ష (సీబీటీ).. మే 15… మే 16న ప్రాథమిక ‘కీ’ విడుదల. ప్రాథమిక ‘కీ’ పై అభ్యంతరాల స్వీకరణ… మే 16-20… మే 23న ఫైనల్ ‘కీ’ విడుదల. మే 25న మెరిట్ లిస్టు విడుదల.
జిల్లాల వారీగా పోస్టులు:
శ్రీకాకుళం(37), విజయనగరం(41), విశాఖపట్నం(34), తూర్పుగోదావరి(53), పశ్చిమగోదావరి(43), కృష్ణా(46), గుంటూరు(50), ప్రకాశం(50), నెల్లూరు(43), కడప (57), చిత్తూరు(46), అనంతపురం(55), కర్నూలు(48).